ఆదిలాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆధ్వర్యంలో నిర్మించనున్న విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..
ఢిల్లీ: భారత వాయు సేన ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్న ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల బదిలీ చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుల్లో ఆదిలాబాద్ విమానాశ్రయం ఒకటని పేర్కొంటూ, భూసేకరణ, మౌలిక సౌకర్యాల బదిలీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.
దేశ సమగ్రత, రక్షణ అవసరాలకు ఈ విమానాశ్రయం కీలకమని పేర్కొంటూ, విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
భారత వాయు సేన కేంద్రంతో పాటు పౌర విమానయాన శాఖ ప్రయాణికుల కేంద్ర భవనం, సరుకు రవాణా కేంద్రం, విమానాల మరమ్మత్తు–నిర్వహణ కేంద్రం, విమానాల నిల్వ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు.
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ విమానయాన సంస్థలు తమ విమానాల నిల్వ కేంద్రాలకు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నాయని, ఆదిలాబాద్ను ఆ దిశగా అభివృద్ధి చేయాలని సూచించారు.
అలాగే మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రతిపాదిత రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి