హసన్పర్తి పెద్ద చెరువులో వృద్ధురాలి మృతదేహం లభ్యం..
హసన్పర్తి : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, హసన్పర్తి గ్రామానికి చెందిన కోడూరి మీనయ్య భార్య రాజమణి (71) గత పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో హసన్పర్తి పెద్ద చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
మృతురాలి భర్త మీనయ్య ఫిర్యాదు మేరకు హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి